పింక్‌ బాల్‌తో మనోళ్ల ప్రాక్టీస్‌

ఇండోర్‌: భారత క్రికెటర్ల ప్రాక్టీస్‌ 'రంగు' మారింది. ఎప్పుడూ ఎరుపు బంతితో నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసే ఆటగాళ్లు మంగళవారం గులాబీ బంతితో ఆడుకున్నారు. భారత సారథి కోహ్లి తొలిసారిగా పింక్‌ బాల్‌తో ప్రాక్టీస్‌ చేశాడని జట్టు వర్గాలు తెలిపాయి. పింక్‌ బాల్‌తో అతను డిఫెన్స్‌ ఆడాడు. కోల్‌కతాలో ఈనెల 22 నుంచి జరిగే డేనైట్‌ టెస్టు కోసం అలవాటు పడేందుకే ఆటగాళ్లు సంప్రదాయ ఎర్ర బంతితో కాకుండా ఈసారి పింక్‌ బాల్‌తో ప్రాక్టీస్‌ చేశారు. పేసర్లు, స్పిన్నర్ల కోసం మూడు నెట్స్‌లను ఏర్పాటు చేయగా, టీమిండియా విజ్ఞప్తి మేరకు త్రోడౌన్‌ ప్రాక్టీస్‌ కోసం మరో చోట టర్ఫ్, బ్లాక్‌ సైట్‌స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు.



ఇక్కడే అందరికంటే ముందుగా కోహ్లి ప్రాక్టీస్‌ చేశాక... తర్వాత పుజారా, శుబ్‌మన్‌ గిల్‌ కూడా పింక్‌ బాల్‌తో ప్రాక్టీస్‌ చేశారు. డేనైట్‌ టెస్టుకు రోజుల వ్యవధే ఉండటంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మార్గదర్శనంలో ఇటీవల రహానే, మయాంక్‌ అగర్వాల్, పుజారా, షమీలకు ప్రత్యేకంగా పింక్‌బాల్‌ ప్రాక్టీస్‌ను బీసీసీఐ ఏర్పాటు చేసింది. గురువారం నుంచి ఇండోర్‌లో తొలి టెస్టు జరుగుతుంది.


భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పిల్లలతో గల్లీ క్రికెట్‌ ఆడాడు. ఇక్కడి బిచోలి మర్దానా ప్రాంతంలో సరదాగా పిల్లలతో క్రికెట్‌ ఆడాడు. ఈ వీడియా, ఫొటో షూట్‌ నెట్టింట బాగా వైరల్‌ అయింది. చెక్‌ షర్ట్, జీన్స్‌ వేసుకొని కోహ్లి పిల్లలతో చేసిన అల్లరిని నెటిజన్లు తెగ 'లైక్‌' చేశారు.